కలం, వెబ్ డెస్క్: ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 294 స్థానాలున్న రాష్ట్రంలో టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే నిబంధనల ప్రకారం మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. వైదొలగాల్సి ఉంది. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మొండిపట్టుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఇదిలా ఉంటే బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. బీజేపీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన సువేంధు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
ఎట్టకేలకు దిగొచ్చిన మమత
సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రమాణం అనంతరం మమతా బెనర్జీ దిగొచ్చారు. తాను మాజీ ముఖ్యమంత్రినేనని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో అప్డేట్ చేసుకున్నారు. గత మూడు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నట్లు పేర్కొన్నారు. “ఫౌండర్ చైర్పర్సన్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15వ, 16, 17వ విధాన సభ)” అని కొత్త బయోలో రాసుకున్నారు. దీంతో ఆమె ఓటమిని అంగీకరించినట్టు అయ్యింది.
ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, బెంగాల్లో బీజేపీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మమతా బెనర్జీ (Mamata Banerjee) మెట్టుదిగినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తీరును మమత తీవ్రంగా విమర్శించారు. అప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని మమత ఆరోపించారు. ‘ఇది ప్రజా తీర్పు కాదు, కుట్ర” అని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయని, దాదాపు 100 సీట్లను “దోచుకున్నారని” పేర్కొన్నారు. కౌంటింగ్ను ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా చేశారని, తద్వారా తమ పార్టీ ఆత్మవిశ్వాసం తగ్గించారని అన్నారు.“మేము ప్రజా తీర్పుతో ఓడిపోలేదు, ఇది కుట్ర వల్ల జరిగినది. నేను ఓడిపోలేదు, నేను వెళ్ళను” అంటూ ఆమె గతలో వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఎక్స్ బయో అప్ డేట్ చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
Read Also: మోడీ సభను విజయవంతం చేద్దాం: కిషన్ రెడ్డి
Follow Us On: WhatsApp

