కలం, వెబ్ డెస్క్: తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్పై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ సమావేశానికి ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు? చివరకు మమతకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది? అన్న టెన్షన్ నెలకొన్నది.
టీఎంసీలో తిరుగుబాటు
తృణముల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా శోభన్దేబ్ ఛటోపాధ్యాయ్ను ఎంపిక చేసిన అనంతరం పార్టీలో ముసలం పుట్టింది. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ మొత్తం 80 ఎమ్మెల్యేల్లో 60 మంది తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.
రెబల్ ఎమ్మెల్యే వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు !
మరోవైపు టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి వాళ్లంతా మద్దతు ఇచ్చారు. రితబ్రతకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశంపై ఉత్కంఠ నెలకొన్నది.
ఈ సమావేశానికి ఎంత మంది హాజరుకానున్నారు?
మమత ఇంట్లో గతవారం జరిగిన సమావేశానికి కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. 60 మంది డుమ్మా కొట్టారు. మరి తాజాగా జరగబోయే సమావేశానికి ఎంత మంది హాజరవుతారో వేచి చూడాలి. 60 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు పెరుగుతున్నదనే సంకేతాలను బయటపెట్టింది. ఇప్పుడు మమత సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సమావేశానికి హాజరయ్యే వారి సంఖ్య ఆధారంగా మమతా బెనర్జీకి ఎవరు మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా తెలియజేయనుంది.
మమత నివాసంలో మీటింగ్
కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసమైన కాలీఘాట్ నివాసంలో ఈ మీటింగ్ జరగనున్నది. తిరుగుబాటు వర్గ నాయకుడు, ఇప్పుడు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న రీతబ్రతా బెనర్జీ ఈ విషయంపై స్పందిస్తూ.. తమకు ఉన్న సంఖ్య నిరంతరం పెరుగుతుందని అన్నారు. “మేము ఇప్పటికే మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సంఖ్యను చూపించాం. అసెంబ్లీ సమావేశాల సమయంలో అది ఇంకా పెరుగుతుంది” అని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గదని కూడా ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేల బాటలో ఎంపీలు..
ఎమ్మెల్యేల బాటలో పలువురు ఎంపీలు కూడా తిరుగుబాటు చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రీతబ్రతా బెనర్జీ నేతృత్వంలోని ఈ తిరుగుబాటు వర్గం తమను తాము “నిజమైన తృణమూల్ కాంగ్రెస్”గా పేర్కొంటోంది. మరి మమతా బెనర్జీ వ్యూహం ఏమిటి? ఆమె ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా? తన పార్టీని రక్షించుకోగలరా? అన్నది వేచి చూడాలి. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేస్తే మమత రాజకీయంగా మరింత బలహీనం కాక తప్పదు.

