కలం, వెబ్ డెస్క్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. మొదట బెంగాల్లో గెలుస్తామని, ఆ తర్వాత ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా బెంగాల్ ప్రజంతా టీఎంసీతోనే ఉన్నారని తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీ (BJP) అరాచక పాలనకు చరమగీతం పాడటమే నా లక్ష్యం. నాకు పదవుల మీద ఆశ లేదు. కేవలం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే నా ధ్యేయం. ‘నేను ఝుల్మురి తింటే.. దాని కారం టీఎంసీకి తగిలింది’’అన్న మోదీ కామెంట్లకు మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ‘‘మేము బెంగాలీలము. మాకు కారం తినడం అలవాటే. కానీ మోదీ జీ.. మీరు ఎప్పుడైనా చేపల కూర తిన్నారా? మేము అన్ని రకాల ఆహారాలను గౌరవిస్తాం. మీలా ఫుడ్ విషయంలో వివక్ష చూపం’’అని మమతా పేర్కొన్నారు.

