కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని విధాన సభలో జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం డీకే.శివకుమార్, మాజీ సిద్ధరామయ్య తదితరులు హాజరయ్యారు. “అందరూ ఎమ్మెల్యేలు నన్ను ఏకగ్రీవంగా రాజ్యసభ స్థానానికి సూచించారు. జూన్ 18న ఎన్నిక జరగబోతుంది. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా అందరూ సమైక్యంగా ఓటేస్తారని భావిస్తున్నా” అని ఖర్గే అన్నారు.
మరోసారి అదే పదవిలో ఖర్గే..
కర్ణాటకలో ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉండటంతో రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. దీంతో పెద్దల సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా కొనసాగబోతున్నారు. వాస్తవానికి సిద్ధరామయ్యను ఈ పదవికి ఎంపిక చేయాలని అధిష్ఠానం భావించినా.. ఆయన తిరస్కరించడంతో తిరిగి ఖర్గేనే రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చింది.

