కలం వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) కోడలు ప్రీతి రెడ్డి (Preeti Reddy) బీజేపీలో చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ప్రీతి రెడ్డి అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్లో వరుసగా బీజేపీ నేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రీతి రెడ్డి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆమె బీజేపీలో చేరుతున్నారంటూ చర్చ నడించింది. దీనిపై ప్రీతి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఇకపై కూడా ఉంటామని స్పష్టం చేశారు. త్వరలో మల్లా రెడ్డి ఏఐ డిజిటల్ యూనివర్సిటీని (AI Digital University) ప్రారంభిస్తున్నట్లు ప్రీతి రెడ్డి వెల్లడించారు. ఈ వర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని, అందులో భాగంగానే బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు.
బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా త్వరలో ఆహ్వానిస్తామని ప్రీతి రెడ్డి (Preeti Reddy) క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చేదంతా కేవలం అబద్ధపు ప్రచారమేనని కొట్టిపారేశారు. తాను విద్యా వేత్తనని, రాజకీయ వేత్తను కాదని ప్రీతి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐ విద్యను తాము ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నట్లు చెప్పారు. తాము ప్రారంభిస్తున్న ఏఐ వర్సిటీ దేశంలోనే మొదటిదని ప్రీతి రెడ్డి చెప్పారు. తాను వెళ్లిన ప్రతిచోటా ఏఐ వర్సిటీ గురించి మాట్లాడానని, ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము చేపట్టబోయే కార్యక్రమం తెలంగాణకే గర్వ కారణమని, అన్ని పార్టీల నుంచి పెద్దలను పిలుస్తామని స్పష్టం చేశారు.
Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ
Follow Us On : WhatsApp

