కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు షాక్ తగిలింది. దానం నాగేందర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేనే అని.. ఆయన పార్టీ మారినట్టు ఎక్కడా దాఖలాలు లేవంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) పిటిషన్ వేశారు. స్పీకర్ ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడం స్పష్టమైన పార్టీ మార్పు కిందకే వస్తుందని.. స్పీకర్ తప్పుడు తీర్పు ఇచ్చారంటూ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) పిటిషన్ లో తెలిపారు.
ఆయన వేసిన పిటిషన్ పై సోమవారం కోర్టు విచారణ జరపబోతోంది. దీంతో దానం నాగేందర్ కు ఇచ్చిన క్లీన్ చిట్ పై ఎలాంటి వాదనలు జరుగుతాయో అని అంతా ఎదురు చూస్తున్నారు. కోర్టు ఏమైనా కీలక ఆదేశాలు ఇస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో అదో ప్రకంపనే అవుతుందని అంటున్నారు న్యాయ నిపుణులు.

