కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) మైదానంలోనే కాదు, పన్ను చెల్లింపుల్లోనూ తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా (Taxpayer) ధోనీ నిలిచారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డాక్టర్ డి. సుధాకర రావు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుండి మొత్తం రూ. 20,000 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో జార్ఖండ్ వాటా రూ. 12,000 కోట్లు కాగా, వ్యక్తిగత విభాగంలో ధోనీ అగ్రస్థానంలో నిలిచారు.
కార్పొరేట్ సంస్థల పరంగా చూస్తే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) వంటి సంస్థలు భారీగా ట్యాక్స్ చెల్లించాయి. మరోవైపు, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025పై ప్రజలకు, బ్యాంకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

