కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పైలట్ అత్యవసరంగా దారి మళ్లించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబై నుంచి థానే జిల్లాలోని ముర్బాద్లో నిర్వహించే ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు షిండే ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. అయితే థానే పరిసర ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారింది. భారీ గాలులు, వర్షం, తుఫాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారినట్లు అధికారులు తెలిపారు.
పైలట్ అప్రమత్తం
వాతావరణం అనుకూలించపోవడంతో పైలట్ వెంటనే హెలికాప్టర్ను ముంబైలోని జుహు ఎయిర్పోర్టుకు మళ్లించారు. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్ సురక్షితంగా జుహు విమానాశ్రయంలో దిగడంతో అధికారులు, అనుచరులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊరట వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతూ భారీ వర్షాలు, ఈదురుగాలులు నమోదవుతున్నాయి.

