కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఇందులో పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్ వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారమైతే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. అలాగే, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా ముగించేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. కేసుల వివరాలను సంబంధిత కోర్టులు, న్యాయవాదులు, పోలీసు అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

