కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక రోడ్డు ప్రమాదం (NH44 Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఆర్మూర్ వైపు వేగంగా వెళ్తున్న ఒక కియా కార్, రోడ్డుపై సాంకేతిక లోపంతో నిలిచిపోయిన లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు వెంటనే సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఇద్దరు తీవ్రంగా నలిగిపోయిన వాహనంలోనే ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి, సుమారు గంటపాటు శ్రమించి జెసిబి సహాయంతో కారు భాగాలను తొలగించి వారిని బయటకు తీశారు. వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అందులోని వారందరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

