కలం, మహబూబ్నగర్ : విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి సారిస్తే విజయాలు సాధించగలరని మహబూబ్నగర్ (Mahabubnagar) ఎస్పీ జానకి (SP Janaki) అన్నారు. డ్రీం ఫోర్స్ ఫౌండేషన్, ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం (Summer Camp) ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థులు సానుకూల దృక్పథంతో నేర్చుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. మంచి విషయాలపై దృష్టి పెట్టి, లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ యోగా చేయడం ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు.
తాను బీటెక్ పూర్తిచేసిన తరువాతే పెద్ద సంస్థలను సందర్శించే అవకాశం లభించిందని, కానీ ప్రస్తుతం డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ కలాం ల్యాబ్ కృషి వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థులకే DRDO వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను సందర్శించే అవకాశం రావడం ఎంతో సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. శిబిరంలో 12 రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి 110 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పోటీలలో విజేతలైన విద్యార్థులకు, అలాగే పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షులు జనార్ధన్, కోశాధికారి నర్సప్ప, డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టి.ఎన్. వెంకటేశ్వర్లు, టి.ఎన్. శ్రీధర్, సభ్యులు మల్లప్ప, గుముడాల చక్రవర్తి గౌడ్, ఆంజనేయులు, అనురాధ, శ్రావణి, శోభారాణి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

