కలం, వెబ్ డెస్క్: ఎల్పీజీ ఎఫెక్ట్ తెలంగాణ హైకోర్టు (High Court) కు కూడా పాకింది. హైకోర్టులో క్యాంటిన్ బంద్ చేయడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పిటిషనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం దేశంలో ఎల్పీజీ సరఫరాపై పడుతోంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలు ప్రాంతాల్లో సిలిండర్లు దొరకక కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి నెలకొంది.
ఎల్పీజీ ఎఫెక్ట్ హైకోర్టుకు కూడా పాకడం గమనార్హం. హైకోర్టుకు ప్రతిరోజూ వందల సంఖ్యలో న్యాయవాదులు, సందర్శకులు హైకోర్టుకు వస్తుంటారు. క్యాంటిన్ అందుబాటులో లేకపోవడంతో భోజనం, తినుబండారాలు, టీ కాఫీ అందుబాటులో లేకుండా పోయాయి. మధ్యాహ్నం భోజన సమయంలో ముఖ్యంగా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా కొన్ని హోటళ్లు, చిన్న రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడినట్టు సమాచారం. కొన్ని చోట్ల రెస్టారెంట్ల యజమానులు మెనూలో కీలక మార్పులు చేశారు. గ్యాస్ వినియోగం ఎక్కువయ్యే వంటలను ఆపేస్తున్నారు. ఎల్పీజీ కొరత కొనసాగితే మరిన్ని హోటళ్లు, క్యాంటిన్లు మూతపడే పరిస్థితి రావచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావాలని హోటల్ యజమానులు, వ్యాపార వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

