కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) కమీషనరేట్ పరిధిలో గడిచిన రెండు నెలల్లో సుమారు 4905 డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drive) కేసులు నమోదవగా రూ. 26 లక్షలు జరిమానా విధించినట్లు గణంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికంగా ఫైన్లు చెల్లిస్తున్న వారు ఇంజినీరింగ్ విద్యార్థులే (Engineering Students) ఉన్నట్లు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
అలవాటుగా మారిన ఫ్యాషన్
ప్రస్తుత సమాజంలో యువతకు మద్యం సేవించడం ఫ్యాషన్గా మారింది. అది కాస్తా ముదిరి అలవాటుగా తయారైంది. ప్రధానంగా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో చాలా మంది మత్తుకు బానిసలవుతున్నారు. గంజాయి, మద్యం లాంటి మహమ్మారి బారిన పడుతున్నారు. గతంలో పలు కళాశాలల్లో గంజాయి లాంటి మత్తు పదార్తాలు దొరికిన ఘటనలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిష్టాత్మక నిట్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇక్కడ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మద్యం, గంజాయి లాంటి మత్తుకు అలవాటు పడి జీవితాలు బలి చేసుకుంటున్నారు. ఇటీవల నిట్లో జరిగిన వేడుకలో కొందరు విద్యార్థులు మద్యం తాగి అస్వస్థతకు గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
మత్తుతో చిత్తు ..!
మద్యం మత్తుకు అలవాటు పడిన యువత అనారోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోతున్నారు. తాగిన మైకంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టింది. ప్రధానంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తూ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కుడా విధిస్తుంది.

