కలం, వెబ్ డెస్క్ : కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. గత 13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న 30 ఏళ్ల హరీష్ రాణాకు కారుణ్య మరణం (Mercy Killing) ప్రసాదించేందుకు ధర్మాసనం కొన్ని షరతులతో అనుమతినిచ్చింది. పరోక్ష పద్ధతిలోనే కారుణ్య మరణం మలవుతుందని పేర్కొన్నది. దీర్ఘకాలం అచేతన స్థితిలో ఉన్న హరీశ్ చనిపోయేందుకు ఇచ్చిన అనుమతి కాదని పేర్కొన్నది. కృత్రిమంగా ఇంకా బతికే ఉండే పరిస్థితిని కొనసాగించకుండా ఉండేలా పాసివ్ యుథనేసియా అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ విశ్వనాధన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. లైఫ్ సపోర్టు సిస్టమ్ను తొలగించేలా ఈ కారుణ్య మరణం ఉండాలని నొక్కిచెప్పింది. ఈ నిర్ణయంతో రాణా కుటుంబ సభ్యుల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది.
2013వ సంవత్సరంలో నాలుగవ అంతస్తు బాల్కనీ నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో హరీష్ రాణా తీవ్రంగా గాయపడ్డారు. నాటి నుండి సుమారు 13 ఏళ్లుగా ఆయన స్పృహ లేని స్థితిలోనే (Vegetative State) కొనసాగుతున్నారు. తనయుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయిన కుటుంబ సభ్యులు, ఆయనకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అత్యాచారానికి గురై దీర్ఘకాలం అచేతనంగా ఆస్పత్రిలోనే ఉండిపోయిన అరుణా షాన్బాగ్ అనే నర్సు కారుణ్య మరణం విషయంలో సుప్రీంకోర్టు 2018లో వెలువరించిన తీర్పును ఆ పిటిషన్లో హరీశ్ తల్లిదండ్రులు ప్రస్తావించారు. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలను ఉదహరించారు. కానీ నర్సు తరహా పరిస్థితితో పోలిస్తే హరీశ్ మెడికల్ హిస్టరీ భిన్నంగా ఉన్నదని పేర్కొని కారుణ్య మరణం ఇవ్వడానికి నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2024లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు హరీశ్ తల్లిదండ్రులు. ఇంకా బతికే అవకాశాలున్నాయన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించినా అప్పటి నుంచీ హరీశ్ మెడికల్ కండిషన్లో మార్పులు లేవని పేర్కొన్నారు.
బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు, హరీష్ రాణా ప్రస్తుత శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకొని పరోక్ష పద్ధతిలో కారుణ్య మరణానికి అంగీకారం తెలిపింది. వారి విన్నపాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు (Supreme Court) ఈ సంచలన తీర్పును ప్రకటించింది.
Read Also: తెలంగాణ హైకోర్టుకు ఎల్పీజీ ఎఫెక్ట్
Follow Us On: Facebook

