కలం, వెబ్ డెస్క్ : కాబోయే భర్తను తోసేసి హత్య చేసిన ప్రాంతం .. ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా మారింది. మహారాష్ట్రలోని పుణే సమీపంలో గల చారిత్రాత్మక లోహగఢ్ కోట (Lohagad Fort)పై ఇటీవల జరిగిన ఒక ఘోర హత్యోదంతం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. తన కాబోయే భర్త, ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ను ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ లోహగఢ్ కోట లోయలోకి తోసి చంపిన సంగతి తెలిసిందే. మొదట ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ఈ కేసు, పోలీసుల విచారణలో పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా తేలడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా 25 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
ఈ ఘోర ఉదంతం జరిగిన నాటి నుంచి కోటను సందర్శించే వారిలో చారిత్రక కట్టడాలను చూడాలనే ఆసక్తి కంటే, ఆ క్రైమ్ సీన్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తోందని స్థానిక గైడ్లు చెప్తున్నారు. కోటకు వచ్చే పర్యాటకులు గైడ్ల వద్దకు వెళ్లి, కేతన్ను తోసేసిన ఆ నిర్దిష్ట స్థలాన్ని చూపించమని అడుగుతున్నారు. అంతేకాదు, సందర్శకులు ఆ ప్రాంతాన్ని అనధికారికంగా “సియా గోయల్ పాయింట్”, “సియా పాయింట్” అని పిలుస్తూ గైడ్లను అక్కడికి తీసుకెళ్లమని కోరుతుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సాధారణంగా సెలవు దినాల్లో లోహగఢ్ కోట (Lohagad Fort)కు వచ్చే పర్యాటకుల సంఖ్య వెయ్యి లోపు ఉండేదని, కానీ ఈ వివాదాస్పద ఉదంతం తర్వాత ఆ సంఖ్య 1500 దాటుతోందని అధికారులు వెల్లడించారు. కేవలం వీకెండ్స్లోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం 400 గా ఉండే సందర్శకుల సంఖ్య ఇప్పుడు 600 దాటిందని పర్యాటక రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.

