కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్రవాద కుట్రను ముందే పసిగట్టి భగ్నం చేశారు. లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన కీలక ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ను ఢిల్లీ పోలీసులు (Delhi Police) అదుపులోకి తీసుకున్నారు. భారత్లో లష్కరే తోయిబా నెట్వర్క్ను తిరిగి బలోపేతం చేసే బాధ్యతలను భుజాన వేసుకున్న షబ్బీర్, దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది.
ముఖ్యంగా కోల్కతా, ఢిల్లీ, తమిళనాడు వంటి ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని, వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో షబ్బీర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకోసం బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి, అక్కడ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. లష్కరే తోయిబా అగ్రనేతలు హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లక్వీలతో షబ్బీర్కు నేరుగా సంబంధాలు ఉండటం గమనార్హం. వీరి కనుసన్నల్లోనే దేశంలోని వివిధ నగరాల్లో ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు అతను ప్రయత్నిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్టుతో లష్కరే తోయిబాకు పెద్ద దెబ్బ తగిలిందని, విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భద్రతా దళాలు భావిస్తున్నాయి.

