కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన న్యాయవాది మొయిజుద్దీన్ (Lawyer Moizuddin Murder Case) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కబాడిగూడకు చెందిన వినయ్ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనే న్యాయవాది ముయిజుద్దీన్ను కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు వినయ్తో సహ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గోవాలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
శనివారం ఉదయం హైదరాబాద్లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాది ముయిజుద్దీన్ను నిందితులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న క్రమంలో కారులో వేగంగా వచ్చిన నిందితులు ముయిజుద్దీన్ను ఢీకొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముయిజుద్దీన్ కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
అయితే కాంగ్రెస్ నాయకుడు ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్లే తన తండ్రిని చంపించారని మొహియుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు. నవాబ్షా ఇంజనీరింగ్ కాలేజ్, అన్వర్ ఉల్ ఉలూం వక్ఫ్, ముంతాజ్ యావిద్దుల వక్ఫ్ వంటి ఆస్తులు వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి. వాటిని ఆక్రమించడంతో కొన్నేళ్లుగా మా నాన్న న్యాయస్థానం ద్వారా పోరాడుతున్నారని, అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు ఆరుసార్లు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

