కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లోని పశ్చిమ విహార్ ప్రాంతంలో ప్రముఖ పంజాబీ సింగర్ గురు రంధావాకు చెందిన జిమ్ వద్ద జరిపిన కాల్పుల కేసులో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్కు చెందిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని సోనిపట్కు చెందిన అర్మాన్ (19), తుషార్ (21) అనే నిందితులను బహదూర్గఢ్లో పట్టుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. జూన్ 11న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బైక్పై వచ్చిన దుండగులు ఈ జిమ్ వెలుపల కాల్పులు జరిపి పరారయ్యారు. ప్రస్తుతం అమెరికా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగ్స్టర్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ఆదేశాల మేరకే వీరు ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్తో గురు రంధావాకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే తాము ఈ కాల్పులు జరిపినట్లు అనిల్ పండిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 100 కిలోమీటర్ల మేర నిందితుల కదలికలను, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తుషార్ అనే యువకుడు కేవలం రెండు వారాల క్రితమే రష్యా నుండి భారత్కు తిరిగి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితులు సాహిల్, సాగర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, తుపాకీని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. గతంలో సైతం సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పలువురిపై కాల్పులు జరిపింది.

