కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ (L Ramana) మండిపడ్డారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయని.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కౌశిక్ రెడ్డి మాటలకు బండి సంజయ్ గూండాలు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద పట్టపగలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను సంజయ్ మనుషులు ద్వంసం చేయడం దారుణమని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్పై బజారు భాషను వాడటమే కాకుండా కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేయించారని ఆరోపించారు.
ప్రశాంతంగా ఉండే కరీంనగర్ రాజకీయాలను బండి సంజయ్ చెడగొడుతున్నారని ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసానికి పాల్పడ్డ గుండాలపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఆస్తుల ధ్వంసానికి వారి నుంచే నష్టపరిహారం వసూల్ చేయాలన్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో నగల దుకాణంలో తుపాకులతో బెదిరించి పట్టపగలే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని చెప్పారు. హైదరాబాద్లో డీసీపీ సుమతి పట్ల పోకిరీలు ప్రవర్తించిన తీరు శాంతిభద్రతలు దిగజారిన తీరును సూచిస్తోందని విమర్శించారు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ ప్రెస్ మీట్ ద్వారానే సమాధానం చెప్పాలన్నారు. చట్టాల మీద ఏ మాత్రం బండి సంజయ్కు నమ్మకం ఉన్నా తన గూండాలను పోలీసులకు అప్పగించాలని చెప్పారు.

