కలం, వెబ్ డెస్క్ : దేశంలో సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ వివాదంపై పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. ఇన్ని రోజులు విద్యార్థుల సమస్యలపై పోరాడిన ఆ పార్టీ ఇక నుంచి సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోనుంది. దీని కోసం ‘క్యా బోల్తీ పబ్లిక్’ అనే దేశవ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం రూపొందించినట్లు ఆయన తెలిపారు. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్య మొదటిది అని చెప్పారు. దేశంలోని అనేక కుటుంబాలు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. చదువుల కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇది మధ్య తరగతి వారికి గుదిబండగా మారింది అని అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్యా బోల్తీ పబ్లిక్’ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాలపై చర్చించడంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తామని అభిజీత్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావాలని కోరారు.

