కలం, కరీంనగర్ బ్యూరో : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రేపు దేశవ్యాప్తంగా జరగనున్న “వీబీ-జి రామ్ జీ”(VBG RAM G) పథకం వ్యతిరేక నిరసనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “వికసిత భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ యోజన (వీబీ-జి రామ్ జీ)” పథకం.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ద్వారా పొందే ఉపాధిని దెబ్బ తీసిందని అన్నారు.
కొత్త పథకంలో నిధుల కేటాయింపును కేంద్రం నిర్ణయించే “నార్మేటివ్ అలొకేషన్” విధానం ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ కార్మికులకు పని హామీ తగ్గే అవకాశం ఉందని కేవీపీఎస్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, నిర్ణయాధికారం తగ్గి కేంద్ర నియంత్రణ పెరుగుతుందని వారు విమర్శించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వారు పేర్కొన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. కొత్త పథకంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని, ఇది వెనుకబడిన రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేవీపీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.

