కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. ఇది నియోజకవర్గ రైతాంగానికి ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మంజూరుపై అయన హర్షం వ్యక్తం చేస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో మండలానికి కేవలం ఒకటి, రెండు కేంద్రాలు మాత్రమే ఉండేవని, కానీ తమ ప్రత్యేక కృషితో ఈసారి ఏకంగా 22 కేంద్రాలను మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. సుజాతనగర్ మండలానికి 4 కేంద్రాలు, చుంచుపల్లి మండలానికి 4 కేంద్రాలు, లక్ష్మీదేవిపల్లి మండలానికి 5 కేంద్రాలు, పాల్వంచ మండలానికి 9 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.
యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు..
పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా గ్రామాల సమీపంలోనే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కూనంనేని (Kunamneni) తెలిపారు. తద్వారా రైతులకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, దళారుల ప్రమేయం లేకుండా మద్దతు ధర నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో కేంద్రాలు రావడం వల్ల ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఎక్కడా జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల మేలుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
Read Also: అడ్డమైన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: RSP
Follow Us On: Instagram

