కలం, ఖమ్మం బ్యూరో: జర్నలిస్టుల హక్కుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని (Kunamneni) సాంబశివరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తృతీయ మహాసభ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో ఘనంగా జరిగింది. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవని ఆయన కొనియాడారు.
జర్నలిస్టులకు పనికితగ్గ వేతనం దక్కాలి
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అమోఘమైనదని, క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని మీడియా యాజమాన్యాల తీరు మారాల్సిన అవసరం ఉందని, రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం, వేతనాలు అందించాలని కూనంనేని (Kunamneni) డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జర్నలిస్ట్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: అమెరికా ఫస్ట్ వర్సెస్ ఇండియా ఫస్ట్: జైశంకర్ హాట్ కామెంట్స్
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

