కలం, నిర్మల్ : నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) డిమాండ్ చేశారు. గురువారం దిలావర్పూర్, సారంగాపూర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ అక్రమాలపై నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే నీట్ లీకేజీ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

