కేంద్రానికి కేటీఆర్ లేఖ.. రైల్వే ప్రాజెక్ట్ కోసం వినతి

కలం, వెబ్ డెస్క్: రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే పరిపాలనా పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు పార్టీ తరఫున ప్రతిపాదనను పంపినట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే‌లోని సికింద్రాబాద్ డివిజన్‌పై (Secunderabad Division) అత్యధిక పరిపాలనా భారం ఉందని బీఆర్ఎస్ లేఖలో ప్రస్తావించింది. తాజా పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ డివిజన్ పరిధి సుమారు 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, కొత్త లైన్ల జోడింపుతో ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఒకే డివిజన్‌పై అధికరద్దీ

ఇంత పెద్ద పరిధి రైల్వేశాఖ నిర్వహణకు ఆటంకంగా మారుతోందని పార్టీ అభిప్రాయపడింది. ఒకే డివిజన్‌పై అధిక రద్దీ, ట్రాఫిక్ ఒత్తిడి, నిర్వహణ సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో ఉండగా, గుంటూరు డివిజన్ 900 కిలోమీటర్లలోపే ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ డివిజన్‌కు ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కాజీపేట డివిజన్ (Kazipet Railway Division) పరిధిలో ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌లో ఉన్న పలు కీలక రైల్వే మార్గాలను చేర్చాలని సూచించారు.

కాజీపేట – బల్హర్షా
పెద్దపల్లి – నిజామాబాద్
కాజీపేట – యెర్రుపాలెం
దోర్నకల్ – మణుగూరు, సత్తుపల్లి మార్గాలు
మోటమర్రి – విష్ణుపురం
కాజీపేట – వంగపల్లి

ఈ మార్గాలు కలిపి సుమారు 1,500 నుండి 2,000 ట్రాక్ కిలోమీటర్ల పరిమాణంలో ఉండే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. పెద్దపల్లి–నిజామాబాద్ మార్గాన్ని హైదరాబాద్ డివిజన్‌కు బదిలీ చేయడాన్ని పునరాలోచించాలని, దానిని కాజీపేట డివిజన్ పరిధిలోనే ఉంచాలని సూచించింది. అలాగే లాతూర్ రోడ్–పరభని మార్గాన్ని నాందేడ్ డివిజన్‌కు తరలించే ప్రతిపాదనను కూడా తిరిగి పరిశీలించాలని KTR  కోరారు.

కాజీపేటకు వ్యూహాత్మక ప్రాధాన్యం

కాజీపేట రైల్వే నెట్‌వర్క్‌లో కీలక జంక్షన్‌గా ఉందని, ప్రధాన రైల్వే మార్గాల కూడలిగా పనిచేస్తుందని లేఖలో వివరించారు. ఇటీవల ట్రిపుల్ లైన్లు, నాలుగు లైన్ల ప్రాజెక్టులు వంటి భారీ మౌలిక వసతుల అభివృద్ధి జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్, మహబూబాబాద్‌లో లోకోమోటివ్ నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని మరింత పెంచిందని తెలిపారు. సింగరేణి బొగ్గు రవాణా, విద్యుత్ రంగ అవసరాలు, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా వంటి అధిక ట్రాఫిక్ మార్గాలు ఈ ప్రాంతం నుంచే నడుస్తున్నాయని బీఆర్ఎస్ పేర్కొంది.

Read Also: హ‌నుమాన్ విజ‌య యాత్ర‌… హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>