కలం, వెబ్ డెస్క్: తాను సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హార్డ్వేర్ కూడా.. ఎప్పుడు గేర్ మార్చాలో తనకు తెలుసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం (BRS Parkal Workers Meeting)లో ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్ధేశం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను సతాయిస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టనని హెచ్చరించారు.
కార్యకర్తల విషయంపై స్పందిస్తూ.. అధికారంలో ఉన్నప్పుడు తాము కూడా కొన్ని తప్పులు, పొరపాట్లు చేశామని చెప్పారు. గతంలో కార్యకర్తలు అనుకున్నంతగా వాళ్ళని పట్టించుకొని మాట వాస్తవమని అన్నారు. వచ్చే ఐదేళ్లలో దాన్ని మార్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలు కానీ, రాజకీయ పదవులు విషయంలో కానీ తానే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. ఇంటింటా సంక్షోభం తెచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పంటల కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి రైతులకు మరణ శాసనం రాశాడని ఆరోపించారు. ఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి మోడీ బ్రోకరా అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని చురకలు అంటించారు. మోడీ చెప్పినంతనే పంట కొంటాం అంటున్నడు రేవంత్ రెడ్డి.. వచ్చే సీజన్ నుంచి రైతన్నల పంటలు కొనే నాథుడే ఉండరని అన్నారు. రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మంచి పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం జరిగితే రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షోభం నెలకొందని ఫైర్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

