కలం, వెబ్ డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా తమ పార్టీ ఓటర్ల ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని శాసన నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, కంటోన్మెంట్ బోర్డ్ సభ్యులు , సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR – ఓటర్ల జాబితా సవరణ), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఇన్ఛార్జ్లకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు కాకుండా కచ్చితమైన నిఘా ఉంచాలని సూచించారు. అర్హులైన ప్రజల ఓటు హక్కును కాపాడటంలో ప్రతి బూత్ స్థాయిలో ‘బూత్ లెవెల్ అసిస్టెంట్లు’ (BLAs) కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. పార్టీ కార్పొరేటర్ ఆశావాహులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.

