కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్ శనివారం ఉదయమే సిట్ అధికారు ముందు లొంగిపోయాడు. వాస్తవానికి అతడు శుక్రవారం సాయంత్రమే అధికారుల ముందుకు వచ్చి లొంగిపోవాలని భావించాడు. కానీ, తన నానమ్మకు గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరడం వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇక శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే భగీరథ్ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం బండి భగీరథ్ను పోలీసులు ఎక్కడ విచారణ చేస్తున్నారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం భగీరథ్ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భగీరథ్ లొంగుబాటు, విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన భగీరథ్ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

