కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్ అని కౌంటర్ ఇచ్చారు. దేశభక్తి, పోరాటాల గురించి తాము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఓజీ ఎప్పటికీ కేసీఆరే అని తేల్చి చెప్పారు.
అయితే తెలంగాణలో పవన కళ్యాణ్ ను పోటీ చేయొద్దని ఎవరన్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన తెలంగాణలో పోటీ చేసిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ అడ్డుకోలేదని.. ప్రజలే అడ్డుకున్నారని తెలియజేశారు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ కు వచ్చి సభ పెడతానంటే ఎలా? అని ప్రశ్నించారు.
ప్రాంతీయవాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసుకున్నారు కదా అది కూడా ప్రాంతీయవాదామా? అని ప్రశ్నించారు. తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారని.. జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్థిక వాదం సరైనదేనా? అని నిలదీశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటే గౌరవం అన్న కేటీఆర్… సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం అని చెప్పారు. అయితే తమ రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.

