కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పంట కొనుగోళ్లపై రైతు సమస్యలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లేఖ రాశారు. పంట కొనుగోళ్ల (Paddy Procurement) సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశంలోనైనా కళ్ళు తెరవాలని సీఎంకు సూచించారు. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా? అంటూ ఘాటుగా లేఖలో రాసుకొచ్చారు. కొనుగోళ్లు జరుపకపోవడంతో ధాన్యం తగలబెట్టుకుంటున్నా రైతుల తండ్లాట తీర్చరా? అంటూ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి? అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడని.. రాస్తారోకో జరగని రహదారి లేదని దుయ్యబట్టారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారు అంటూ విమర్శించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

