కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. బావిలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు మల్లయ్యకుంట గ్రామానికి చెందిన మహిళగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయిందా? లేక ఎవరైనా చంపి బావిలో పడేశారా, ఇతర కారణాలున్నాయా? అనే విషయాలు తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

