కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా పుల్కల్ (Pulkal) మండలం గోంగ్లూర్ గ్రామంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు భారీగా బారులు తీరారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట కిలోమీటర్ మేర క్యూ లైన్లు కనిపించాయి. స్థానికుల సమాచారం ప్రకారం, గత కొన్ని రోజులుగా గ్యాస్ సిలిండర్ల స్టాక్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా స్టాక్ రావడంతో ప్రజలు ఉదయం 4 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు.
గ్యాస్ బుకింగ్ చేసి నెల రోజులు గడిచినా సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరాలో జాప్యం కారణంగా గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించి, సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

