కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రైతులకు అమలుచేసిన ఉచిత కరెంట్ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని ఆరోపించారు. నిన్నటి సమావేశంలో సీఎం మాట్లాడుతూ రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
అప్పుడు 3 గంటల కరెంటే సరిపోతుందన్నాడు..
రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకి కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని అన్నారని గుర్తు చేశారు. సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే, రైతన్నలకు ఉచిత కరెంట్ను విద్యుత్ సరఫరాను ఆపేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపించారు. రైతన్నలకున్న 24 గంటల ఉచిత కరెంట్ను ఎగగొట్టేందుకే ఈ ప్రత్యేక రైతు డిస్కం అని చెప్పారు. తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవవలసిన అవసరం ఉందని చెప్పారు.
ఆ విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమయింది..
రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీ నెరవేర్చడనే విషయం రాష్ట్రప్రజలకు అర్థమయిందని అన్నారు. 79 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరానికి అద్భుతమైన ఫ్లై ఓవర్లను, అండర్ పాస్లను, బ్రిడ్జ్లను, 20,000 లీటర్ల ఉచిత తాగునీటిని, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, జీవో 58, 59 ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ భూములను అందించిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

