కలం, వెబ్ డెస్క్: చైనా సైన్యం (China Military) తన బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలకున్న సమయంలో ఘోర అవమానానికి గురైంది. తాజాగా మకావులో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రదర్శించిన సైనిక ప్రదర్శన నవ్వులపాలైంది. చైనా మేడ్ అత్యాధునిక యుద్ధ ట్యాంకులు ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి మొరాయించాయి. మకావు పౌరుల సమక్షంలో తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించి వారిని ఆకట్టుకోవాలని భావించిన చైనాకు, ఈ సాంకేతిక లోపం తీవ్ర అవమానాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించామని చైనా గొప్పగా చెప్పుకునే ఈ యుద్ధ ట్యాంకులు నడిరోడ్డుపై ఆగిపోవడంతో, వాటిని కదిలించేందుకు సైనికులే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. భారీ బరువున్న ఆ ట్యాంకులను సైనికులు వెనుక నుంచి నెడుతున్న దృశ్యాలు చైనా రక్షణ రంగంలోని నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలోనూ చైనా తయారు చేసిన ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇలాగే మొరాయించిన సందర్భాలు ఉన్నాయి. మేడ్ ఇన్ చైనా వస్తువులకే కాదు, వారి యుద్ధ ట్యాంకులకు కూడా గ్యారెంటీ లేదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో చైనా మిలిటరీ ప్రతిష్టను గట్టిగా దెబ్బతీసింది.

