కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ (Medchal)లో జరిగిన బీఆర్ఎస్ (BRS) ఉమ్మడి కార్యకర్తల సమావేశం వేదికగా పార్టీలోని ఉద్యమకారులు తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఓడిపోయినా నాయకత్వ ధోరణిలో మార్పు రాలేదని, గులాబీ జెండాను నమ్ముకున్న వారికంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు మండిపడ్డారు. వందలాది మంది ఉద్యమకారులు హాజరైన ఈ సమావేశంలో కనీసం ఒక్కరిని కూడా వేదికపైకి పిలిచి గౌరవించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలను విమర్శించడం మానేసి, ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని వారు హితవు పలికారు.
పార్టీని నమ్ముకున్న ఉద్యమకారులను విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం కావడం ఖాయమని, కేసీఆర్ వెంటనే స్పందించకపోతే బీఆర్ఎస్కు మరోసారి గట్టి షాక్ తప్పదని వారు హెచ్చరించారు. పార్టీ మారే నేతలను నమ్మవద్దని, తమ ఆవేదన కేసీఆర్, కేటీఆర్ల వరకు చేరడం లేదని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మీడియా మిత్రులే, ఇప్పుడు తమ గోడును పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే పార్టీ మనుగడ కష్టమని, ఉద్యమకారులను గౌరవించినప్పుడే పార్టీకి పూర్వవైభవం వస్తుందని వారు స్పష్టం చేశారు.

