కలం, వెబ్ డెస్క్: సిరిసిల్ల నేతన్నల కష్టాలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను (Sircilla weavers) కాపాడాలని వారిని కోరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్ఛార్జీల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయ వంటిదని చెప్పారు. గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను వారి దృష్టికి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని చెప్పారు. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్ఎస్ఐ (SSI) యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్ఛార్జీలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేయాలన్నారు.

