కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నిక(Municipal Elections)ల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.ఎన్నికల వ్యూహంలో సమన్వయం కీలకమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ విజ్ఞప్తిని మన్నించి నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి.. వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ప్రచారంపై దృష్టి సారిస్తూ, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలు అంచనా వేసి గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థుల గెలుపుతో పాటు ఓటింగ్ శాతం పెంచడంపై దృష్టి సారించాలని కేటీఆర్ (KTR) సూచించారు


