కలం, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకరమైన ఘటనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే.. కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఉన్నత విద్యా ప్రమాణాలను కాలరాసి చివరికి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారన్నారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు సర్కారు నిర్వాకం వల్ల కన్నుమూసినా.. మానవత్వం లేని ముఖ్యమంత్రిలో కనీస చలనం లేదని విమర్శించారు. విద్యార్థిని శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

