కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతోనే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని మంత్రులు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు (Kalluru)లో రూ.10.50 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని బుధవారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం ద్వారా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లోని పలు గ్రామాల నుంచి సుమారు 70 వేల మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం ఒక నిదర్శనమని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

