కలం, స్పోర్ట్స్ : అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను(Washington Sundar) ఎంపిక చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ తరఫున బరిలోకి దిగే ముందు సుందర్ తన మ్యాచ్ ఫిట్నెస్ను నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం డాక్టర్ సర్టిఫికెట్ ఆధారంగా ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయడం సరికాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
గత జులైలో ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో సుందర్ తొడ కండరాల గాయానికి గురయ్యారు. అప్పటి నుంచి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నారు. శ్రీలంక సిరీస్కు దూరంగా ఉన్న సుందర్ కేవలం రెండు వారాల్లోనే ఎలా ఫిట్ అయ్యారని శ్రీకాంత్ ప్రశ్నించారు. ప్రతి రెండు, మూడు సిరీస్ల తర్వాత సుందర్ గాయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో సుందర్ రాణిస్తున్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో తన లయను కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఆయన ధారాళంగా పరుగులు సమర్పించుకున్న విషయాన్ని శ్రీకాంత్ గుర్తుచేశారు.
సెప్టెంబర్ 13 నుంచి టీ20 సిరీస్
అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 13న తొలి మ్యాచ్ జరగనుండగా, సెప్టెంబర్ 15, 17 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్లు నిర్వహించనున్నారు. మూడు మ్యాచ్లకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలకు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి జట్టులో చోటు కల్పించారు.
టీమిండియా స్క్వాడ్
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా*.
గమనిక: * గుర్తు ఉన్న ఆటగాళ్ల ఎంపిక ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది.

