కలం, స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ ఫైనల్కు ముందు సౌత్ జోన్కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ మ్యాచ్లో ఆడటం లేదు. ఈ విషయాన్ని సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టం చేశారు. ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఫైనల్ కోసం కేఎల్ రాహుల్తో పాటు మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ను సౌత్ జోన్ జట్టులోకి తీసుకున్నారు.
అయితే రాహుల్ మాత్రం తుది మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు సిరాజ్, పడిక్కల్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సెమీఫైనల్లో ఓపెనర్గా వచ్చిన రికీ భుయ్.. ఎన్. జగదీశన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. సౌత్ జోన్ సెమీఫైనల్లో నార్త్ జోన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. ఆ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు.
తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 116 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 51 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈస్ట్ జోన్ కూడా మంచి ప్రదర్శనతో ఫైనల్కు వచ్చింది. సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇలా టైటిల్ పోరుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. అయితే ఫైనల్కు ముందు కేఎల్ రాహుల్ దూరం కావడం సౌత్ జోన్కు కీలక పరిణామంగా మారింది.

