కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల(Jagtial) జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. సభ వేదికగా నిర్ణయించిన మోతె రోడ్డుకు సమీపంలోని స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశం ఇస్తామని తెలిపారు. అలాగే జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 20న జరిగే సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని, లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సభకు కేసీఆర్ స్వయంగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, మాజీ DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

