కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న సన్నిధిలో హనుమాన్ వేడుకల వేళ ప్రమాదం సంభవించింది. స్వామివారి దర్శనం కోసం మాలధారణ భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చిన క్రమంలో, కేశఖండనశాల వద్ద ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది భక్తులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆ ప్రాంతం భక్తులతో కిక్కిరిసి ఉండటంతో పెను ముప్పు వాటిల్లేదని, అయితే తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం అధికారులు ఆలయంలో (Kondagattu) ఏర్పాటు చేసిన ఈ చలువ పందిళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ఈ అనర్థం జరిగిందని భక్తులు మండిపడుతున్నారు. నాసిరకం పనుల కారణంగానే పందిరి భారాన్ని తట్టుకోలేక కూలిపోయిందని, లక్షలాది మంది తరలివచ్చే ఉత్సవాల సమయంలో అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పవిత్రమైన ఉత్సవాల వేళ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి అపశృతి చోటుచేసుకోవడంపై భక్తజనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పంచాయతీలకు అవార్డులు.. మంత్రి సీతక్క అభినందనలు
Follow Us On: X(Twitter)

