కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను తొలగించిన పరిణామాల వేళ, ఆమె కుమార్తె కొండా సుష్మిత (Konda Susmitha) తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన వల్లనే తన తల్లి పదవి కోల్పోవాల్సి వచ్చిందంటూ సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగానికి గురై ఏడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తల్లి మంత్రి పదవి తొలగింపుపై సుష్మిత (Konda Susmitha) ఆక్రోశం వ్యక్తం చేశారు. “నా వల్లే ఇదంతా జరిగింది. అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందని ఈ స్థాయిలో అవమానించారు?” అని ఆమె ప్రశ్నించారు. తాను గతంలో మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని, ఇప్పటికీ ఆ విషయాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మా అమ్మ బాధ్యతలు నిర్వహించిన శాఖలో ఇప్పటివరకు చిన్న అవినీతి కూడా జరగలేదని, ఆమె ఎంతో ప్రామాణికంగా పనిచేసిందని సుష్మిత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కొండా సుష్మిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎంత ఒత్తిడి వచ్చినా మా అమ్మ, నాన్న కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని సుష్మిత స్పష్టం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు, చిట్టా తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిన్నింటినీ బయటపెట్టి మాట్లాడతానని హెచ్చరించారు.

