కలం, వెబ్ డెస్క్ : ‘జై శ్రీరామ్’ అంటే పైసలు పడతాయా? అని ఇటీవల ఓ సమావేశంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఎదురుదాడికి దిగాయి. అయితే తాజాగా తన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. తాను చెప్పింది మొత్తం పక్కనపెట్టి, శ్రీరాముని అంశాన్నే మాత్రమే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా తాను కూడా హిందూవునేనని.. అందుకే ఇంట్లో నుండి బయటకు వచ్చే ముందు దేవుణ్ణి మొక్కుకొని, బొట్టు పెట్టుకొని బయటకు వస్తానని గుర్తు చేశారు. శ్రీరాముడి వారి దేవుడే అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తుందని చెప్పారు. మీరేమైనా తలపై హిందూవులు అని రాసిపెట్టుకున్నారా? మెడలో హిందూవు అని బోర్డు వేసుకున్నారా? బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. కేంద్రం భద్రాచలం శ్రీరాముడికి రూ. 200 కోట్లు ఇచ్చిందా? అని నిలదీశారు. రాముని కోసం తమ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా రూ. 300 కోట్లు ఇచ్చారని చెప్పారు. తాను మాట్లాడిన దానిలో కట్, పేస్ట్ చేసి శ్రీరాముడిని తిట్టినట్టు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.

