కలం, మిర్యాలగూడ: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జాదారుల నుంచి విముక్తి చేయడమే ‘హైడ్రా'(HYDRAA) ప్రధాన లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) పేర్కొన్నారు. గురువారం మిర్యాలగూడ (Miryalaguda) లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో సుమారు ₹10 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 2,100 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుందని, ఇందులో చెరువులు, పార్కులు, కీలక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 25 చెరువులను ఇప్పటికే పునరుద్ధరించగా, మరో 100 చెరువులను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
అమీన్పూర్ ప్రాంతంలో ముఖిమ్ సంధ్య శ్రీధర్ రావు, మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేసి భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలపైనా కఠినంగా వ్యవహరించామని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, చట్ట పరిధిలో ఆక్రమణదారులను ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా హైడ్రా సేవలను అమలు చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం మేరకు జిల్లాలలోనూ చర్యలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న భూములను కేవలం ఖాళీగా ఉంచకుండా, ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని రంగనాథ్ హామీ ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటం.. ప్రజల కోసం వాకింగ్ ట్రాక్లు, ఫిజికల్ యాక్టివిటీ జోన్లు , పార్కులను నిర్మించడం.. ఈ పనులన్నింటినీ రాబోయే రెండు సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.

