కలం, చౌటుప్పల్: ధాన్యం నిల్వ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మునుగోడు నియోజకవర్గ రైతులకు ఊరట లభించింది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల (3 లక్షల బ్యాగులు) భారీ సామర్థ్యం గల ప్రైవేట్ గోదామును రైతుల ధాన్యం నిల్వ ఉంచడం కోసం కేటాయించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ఈ ప్రైవేటు గోదామును సోమవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) స్వయంలింగా పరిశీచారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ధాన్యం దిగుబడి ఊహించని విధంగా పెరిగింది..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రైతుల వరి ధాన్యం నిల్వ చేయడానికి దాదాపు 1.50 లక్షల క్వింటాళ్ల సామర్థ్యం గల ఈ ప్రైవేట్ గోదామును తీసుకుంటున్నాం. నియోజకవర్గంలో ధాన్యం దిగుబడి ఊహించని విధంగా పెరిగింది. ఈసారి చౌటుప్పల్ మండలంలో రెండు రెట్లు, నారాయణపూర్ మండలంలో నాలుగు రెట్లు ఎక్కువ ధాన్యం దిగుమతి పెరిగింది. దీనికి తోడు హమాలీల కొరత ఏర్పడటం, కొందరు మిల్లర్ల అలసత్వ వ్యవహారం వల్ల ధాన్యం సేకరణ ప్రక్రియ కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఇందుకు ప్రభుత్వం తరఫున రైతులకు నేను క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశించాం..
ధాన్యం సేకరణ వేగవంతం చేయడంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. “రాబోయే 10 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా ముగించాలని అధికారులను ఆదేశించాం. ఈ మేరకు రైతులకు నేను మాట ఇస్తున్నాను. రైతులు అధైర్యపడొద్దు. రాత్రింబవళ్లు కష్టపడి రైతులకు అండగా నిలవాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ధాన్యం నిల్వ సామర్థ్యం సరిపోకపోతే, మరికొన్ని పెద్ద ప్రైవేటు గోదాములను కూడా మాట్లాడి రైతుల కోసమే కేటాయిస్తాం” అని రాజ్గోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతు నాయకులు పాల్గొన్నారు.

