కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ అమరుల ఆకాంక్షల సాధన కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం (Kodandaram) అన్నారు. హనుమకొండలోని వరంగల్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం తెలంగాణ జన సమితి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం హాజరై మాట్లాడారు. ఈ నెల 12న తెలంగాణ జనసమితి (TJS) నాలుగో ప్లీనరీ హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లీనరీలో ప్రధానంగా రాజకీయ పరిస్థితులను సమీక్షించునున్నట్లు తెలిపారు. ఈ మేరకే భవిష్యతు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉద్యమశక్తిగా నిలబడిందన్నారు.
గత ప్రభుత్వంలో ప్రతి పోరాటానికి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చర్చలకు అవకాశం కల్పిస్తోందని తెలిపారు. మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండున్నరేండ్లలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, ఆదివాసీల ఎన్నో సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్లీనరీ అనంతరం కార్యాచరణ ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని, ప్రభుత్వ పంపిణీ చేసే వనరుల్లో ప్రజలకు న్యాయమైన వాటా దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, హనమకొండ జిల్లా అధ్యక్షుడు చిల్లా రాజేంద్రప్రసాద్, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు.

