కలం, వెబ్ డెస్క్: దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్గా మహబూబ్ నగర్ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarasimha) వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాలో వైద్య సేవలను బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆరోగ్య అవగాహన వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ఆయుష్ ఆధ్వర్యంలో హోమియోపతి, ఆయుష్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన యోగా, ఉచిత ఆయుర్వేద, యునాని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీలో హాస్టల్స్, ఆడిటోరియం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పీహెచ్సీ నుండి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీని రిఫరల్ ఆస్పత్రిగా అప్డేట్ చేయబోతున్నామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 95 శాతం చికిత్సలు అందుబాటులో ఉండబోతున్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల పెంపుతో పాటు అదనంగా 14 డిపార్ట్మెంట్ లను పెంచబోతున్నామని అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ తరహాలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాలేజీలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సెంటర్, వాస్కులర్ యాక్సెస్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీలో సర్జికల్ డిపార్ట్మెంట్ ను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల కల్పనకు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి, ఆధునిక ఎక్విప్మెంట్ ను సమకూర్చడానికి కృషిచేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని విద్యార్థులకు మంత్రి వివరించారు. జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి డీఎస్హెచ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం, హాస్టల్ , రవాణా సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. సీఎం సహకారంతో మహబూబ్ నగర్లో ఐఐఐటీ (IIIT) ఐటీ వచ్చిందని చెప్పారు. జిల్లాలో జాతీయ రహదారుల వెంట ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

