కేకేఆర్‌కు షాక్: రఘువంశీకి గాయం.. సరికొత్త వివాదం!

కలం, వెబ్‌ డెస్క్‌ : ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లేఆఫ్స్ రేసులో ఇంకా నిలిచింది. ఈ గెలుపు సంతోషం మధ్యలోనే కేకేఆర్‌కు ఒక పెద్ద షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఆ జట్టు యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ (Raghuvanshi) గాయపడటమే కాకుండా, ఇప్పుడు ఒక కొత్త వివాదానికి కారణమయ్యారు. కన్కషన్ రూల్ ప్రకారం ఆయన రాబోయే ఏడు రోజులు ఆటకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు ఆయన దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ 11వ ఓవర్లో తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ కోసం పరిగెడుతూ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రఘువంశీ ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రఘువంశీ చేతికి దెబ్బతగిలి మైదానం వీడారు. అయితే, ఆ తర్వాతే అసలు గందరగోళం మొదలైంది. రఘువంశీ స్థానంలో రమణ్‌దీప్ సింగ్ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్నాడంటూ కేకేఆర్ మొదట ట్వీట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసింది. చివరకు తేజస్వి సింగ్ మైదానంలోకి వచ్చి 13 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

చేతికి గాయమైతే ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ (తలకి దెబ్బతగిలితే ఇచ్చే రీప్లేస్‌మెంట్) ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది కేకేఆర్‌ను సరికొత్త వివాదంలోకి నెడుతోంది. మరి ఈ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌పై స్పష్టత ఇస్తుందేమో చూడాలి. ఏదేమైనా, ఈ సీజన్‌లో 422 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచిన రఘువంశీ దూరం కావడం కేకేఆర్‌ను కలవరపెడుతోంది. రాబోయే ఢిల్లీ మ్యాచ్‌లో గెలిచి, మిగిలిన జట్ల ఫలితాలు అనుకూలిస్తేనే కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>